నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి హిందూపురం ఆయనకు తిరుగులేని కోటగా మారింది. 2019లో సైతం రాష్ట్రంలో వైసీపీ హవా ఉన్నప్పటికీ బాలకృష్ణ తన పట్టు నిలుపుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఎన్ని విమర్శలు వచ్చినా హిందూపురం ప్రజలు బాలకృష్ణను ఆదరించారు. అయితే, ఇటీవల కాలంలో బాలకృష్ణ నియోజకవర్గంలో కనిపించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. టీడీపీ నిర్వహించిన ప్రజా దర్బార్లో సైతం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదని ఫిర్యాదులు రావడం గమనార్హం. అంతేకాకుండా, హిందూపురంలో బాలకృష్ణ కనిపించడం లేదంటూ బ్యానర్లు కూడా వెలిశాయి.
2014లో మొదటిసారి గెలిచిన సమయంలో బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉండేవారు. అప్పుడప్పుడు హిందూపురం వచ్చేవారు. నియోజకవర్గ పనుల కోసం ఒక వ్యక్తిని పీఏగా నియమించారు. కానీ ఆ పీఏ సొంతంగా వ్యవహరించడంతో విసిగిపోయిన టీడీపీ కార్యకర్తలు అతడిపై దాడికి పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాలకృష్ణ స్వయంగా నియోజకవర్గ వ్యవహారాలు చూసుకుంటూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి హిందూపురంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకునేవారు.
2019లో బాలకృష్ణ విజయం సాధించినప్పటికీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ సమయంలో హిందూపురంలో పట్టు సాధించేందుకు వైసీపీ ప్రయత్నించింది. అయితే బాలకృష్ణ ప్రజల కోసం పోరాటాల్లో ముందుండేవారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తరచూ హిందూపురంలో పర్యటించేవారు. శ్రీ సత్యసాయి జిల్లాను హిందూపురం జిల్లాగా మార్చాలనే డిమాండ్తో కొంతకాలం పోరాటం చేశారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక జిల్లాను ప్రకటిస్తామని కూడా హామీ ఇచ్చారు.
అయితే, కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా బాలకృష్ణ ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే నియోజకవర్గానికి వచ్చారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ విదేశాల్లో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడ ఉన్నారంటూ ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే హిందూపురంలో బాలకృష్ణ కనిపించడం లేదని ఫ్లెక్సీలు వెలిసి తొలగించారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రచారం జరుగుతోంది.