ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ఫుల్ షో ఏదైనా ఉందంటే అది ముమ్మాటికీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి “ప్రజా వేదిక”లే! అబ్బో… ఏమి ఆ వేదిక! ఏమి ఆ జనం! ఏమి ఆ కన్నీళ్లు! ఏమి ఆ తక్షణ సాయం! మొత్తం మీద ఒక ఆస్కార్ లెవెల్ ప్రొడక్షన్ నడుస్తోందక్కడ.
ఎక్కడో గతంలో చెప్పిన “సూపర్ 6 గ్యారంటీ”ల గురించి జనం పెద్దగా మాట్లాడకుండా, వాటి సంగతేంటని నిలదీయకుండా ఉండేందుకు మనసు పెట్టి మరీ తీర్చిదిద్దిన ఈ “ప్రజా వేదిక”ల పరమార్థం అమోఘం. ఇది కేవలం ప్రజల సమస్యలు వినే వేదిక కాదు సుమా… ముఖ్యమంత్రి గారి గొప్పదనాన్ని, దాతృత్వాన్ని, తక్షణ స్పందనను ప్రపంచానికి చాటి చెప్పే బృహత్తరమైన పీఆర్ యజ్ఞం!
ఈ యజ్ఞంలో భాగంగా ఎంచుకున్న పాత్రధారులు… క్షమించండి, బాధితులు… అద్భుతంగా నటిస్తున్నారు. వారిని స్టేజీపైకి తీసుకురావడం, వారి దుఃఖాన్ని కెమెరాల ముందు ప్రదర్శించడం, ముఖ్యమంత్రి గారు వెంటనే కరిగిపోయి ఏదో ఒక చిన్న సాయం ప్రకటించడం… ఈ సీన్లను టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలు కచ్చితంగా కన్నీరు పెట్టుకుని తీరాల్సిందే! అప్పుడే కదా మన ముఖ్యమంత్రి గారు అపర దానకర్ణుడని, పేదల పాలిట పెన్నిధి అని అంతా నమ్మేది!
తాజాగా జరిగిన ఒక ఎపిసోడ్ అయితే ఈ మొత్తం డ్రామాకు హైలైట్ అని చెప్పుకోవాలి. ఒక గిరిజన దంపతులను స్టేజీపైకి తీసుకొచ్చారు. వారి సమస్యను వింటున్నట్లు ఓ వాతావరణం క్రియేట్ చేశారు. తీరా చూస్తే… పాపం ఆవిడగారు! ముఖ్యమంత్రి గారు ఏ డైలాగ్ చెబితే, ఆవిడ అదే డైలాగ్ వెనకే చెబుతూ అడ్డంగా దొరికిపోయింది. అసలు సిసలు ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారులే పాపం! లైవ్ పెర్ఫార్మెన్స్లో చిన్న గ్లిచ్ వచ్చి పడింది.
వెంటనే మన ముఖ్యమంత్రి గారిలో ఉన్న గొప్ప నటుడు బయటికొచ్చారు. ఆ పరిస్థితిని కవర్ చేయడానికి ఆయన పడిన పాట్లు, మాట్లాడిన మాటలు విని జనం నవ్వు ఆపుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఆ వీడియో అయితే అగ్గి రాజేస్తోంది. “ఏమండీ.. వాళ్లు చెప్పినట్టు చెప్పకండి.. మీకు ఏం కావాలో అది చెప్పండి” అని ముఖ్యమంత్రి గారు అనడం… దానికి ఆవిడ “అవును సార్.. వాళ్లే చెప్పమన్నారు సార్..” అని అమాయకంగా చెప్పడం… ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నాలుక కరుచుకోవడం… ఇదంతా కలిపి ఒక పర్ఫెక్ట్ కామెడీ సీన్!
మొత్తానికి చూస్తుంటే… “ప్రజా వేదిక” అంటే ప్రజల సమస్యలు వినే వేదిక కాదు, ప్రజలను నవ్వించే వేదికగా, ముఖ్యమంత్రి గారి దర్శకత్వ ప్రతిభను, ఎంచుకునే నటీనటుల టాలెంట్ను నిరూపించే వేదికగా మారిపోయింది. సూపర్ 6 గ్యారంటీలు ఎప్పుడు అమలవుతాయో ఏమో కానీ, ఈ “ప్రజా వేదిక” డ్రామాలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని గ్యారంటీ ఇవ్వొచ్చు! టికెట్ తీసుకోకుండానే ఇంత మంచి వినోదం అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! ఇట్లు, పీఆర్ మాయలో పడి నవ్వుకుంటున్న సామాన్యుడు.