ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్ళిపోయారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ భవిష్యత్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్య నేతలు సైతం ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారని వార్తలు వినిపించాయి. ఇటువంటి తరుణంలో వైసీపీలోకి కొత్త చేరికలు పార్టీకి ఊపునిస్తున్నాయి. ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరగా, తాజాగా పలువురు కీలక ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలువురు ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వానికి అండగా నిలిచారు. వారంతా ఇప్పుడు అధికారికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెస్ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవో సంఘం నాయకుడు తోట సీతారామాంజనేయులు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరంతా గతంలోనూ వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు అధికారికంగా పార్టీలో చేరడం గమనార్హం.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, అందుకే తామంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల మాజీ నాయకులు స్పష్టం చేశారు. కూటమి పాలనలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని, తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులంతా ఇప్పుడు గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని వారు పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల్లో వస్తున్న మార్పులను వారు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని విమర్శించారు.
మరోవైపు, గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనను ఉద్యోగ సంఘాల మాజీ నేతలు కొనియాడారు. తన సంక్షేమ పాలనతో జగన్ గుప్తుల స్వర్ణయుగాన్ని తలపించారని ప్రశంసించారు. కరోనా వంటి కష్టకాలంలో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడినా, ఏపీలో జగన్ సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలను కాపాడుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసినా, ఆ నిధులు ఎటు పోయాయో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. మోసపూరిత హామీలతోనే కూటమి అధికారంలోకి వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.