ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇటీవల మరణించిన సింగయ్య మృతిపై అతని భార్య లూర్దు మేరీ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను టీడీపీ నేతలే చంపేశారని ఆరోపించిన ఆమె, ఈ ఘటనలో నారా లోకేష్పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. సింగయ్య చనిపోయిన తర్వాత తమ ఇంటికి 50 మంది నారా లోకేష్ అనుచరులు వచ్చారని, తమను బెదిరించారని ఆమె వెల్లడించారు.
లూర్దు మేరీ తెలిపిన వివరాల ప్రకారం, “సింగయ్య చనిపోయిన తర్వాత నారా లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారు. మేము కూడా మీ కులస్థులమేనని చెప్పారు. కాగితాలపై ఏదో రాసుకొచ్చి సంతకాలు చేయమన్నారు. సంతకం చేయకపోవడంతో మమ్మల్ని బెదిరించారు.” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల పాత్రపైనా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. “పోలీసులు కూడా వీడియో చూపిస్తూ సంతకాలు చేయమన్నారు. మా మీద రకరకాలుగా ఒత్తిడి చేశారు” అని లూర్దు మేరీ పేర్కొన్నారు.
తన భర్త మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. “నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఆసుపత్రికి తరలించేటప్పుడు అంబులెన్స్లో ఏదో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లనీయలేదు. చిన్న చిన్న గాయాలకే సింగయ్య ఎలా చనిపోతాడు? ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది” అని సింగయ్య భార్య లూర్దు మేరీ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సింగయ్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో