ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన ఆరోపణ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా విషప్రచారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నెలకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని వై.సి.పి అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
మంగళగిరి నుండే రూ. 200 కోట్ల ‘విషప్రచారం’
కారుమూరి వెంకటరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మొత్తం దుష్ప్రచారం టీడీపీ ఐటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. టీడీపీ ప్రధాన కార్యాలయం మంగళగిరి పార్టీ ఆఫీస్ నుండే ఈ కార్యకలాపాలు సాగుతున్నాయని, కేవలం వై.ఎస్. జగన్ను బ్యాడ్ చేయడానికే నెలకు సుమారు రూ. 200 కోట్ల భారీ మొత్తాన్ని సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
నారా లోకేష్ నేతృత్వంలోని టీడీపీ ఐటీ వింగ్ ఈ మొత్తం ప్రచారానికి వెనుక ఉందని, వ్యవస్థీకృతంగా విషప్రచారాన్ని నడుపుతోందని వెంకటరెడ్డి పేర్కొన్నారు.
జగన్ టీడీపీకి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనలను డైవర్ట్ చేయడం.. నీరు గార్చేందుకు.. అలాగే జగన్ గత ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పాలనపై ప్రజల్లో ఉన్న సానుకూలతను తగ్గించడమే ఈ భారీ ఖర్చుతో కూడిన దుష్ప్రచారం ప్రధాన లక్ష్యంగా వై.సి.పి నాయకులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అబద్ధాలు, వక్రీకరణలు, అసత్య కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని పార్టీని దెబ్బతీయాలని టీడీపీ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. రూ. 200 కోట్ల ఖర్చుతో విషప్రచారం జరుగుతోందన్న వై.సి.పి అధికార ప్రతినిధి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. గతంలో కూడా ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా ప్రచారం, అసత్య వార్తలపై పరస్పర ఆరోపణలు చోటు చేసుకున్నాయి.