ఏపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలనను పూర్తి చేసుకుని రెండవ ఏడాదిలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ విశ్లేషకులు, మీడియా సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. చాలా వరకు మీడియా నివేదికలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాత్రం తనదైన శైలిలో షాక్ ఇచ్చింది.
ఎప్పుడూ చంద్రబాబుకు అనుకూలంగా ఉండే ఛానల్గా పేరు తెచ్చుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ఈసారి మాత్రం ఊహించని విధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపింది. ఛానల్ ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ తన తాజా రిపోర్ట్లో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి, అక్రమ భూకబ్జాలు, ఇసుక మాఫియా, స్మార్ట్ మీటర్ల వ్యవహారాలు, రెగ్యులర్ పాలనలో అవ్యవస్థలు వంటి అంశాలపై రాధాకృష్ణ విమర్శనాస్త్రాలు సంధించారు.
గతంలో వైసీపీ ప్రభుత్వంపై ఇదే ఛానల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అప్పట్లో భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక అక్రమాలు అధికంగా ఉన్నాయంటూ అనేక కథనాలు ప్రసారం చేసింది. కానీ ఇప్పుడు అదే ఛానల్ కూటమి ప్రభుత్వాన్నీ ఇలాంటి ఆరోపణల నుండి మినహాయించడం లేదు. ఇప్పుడూ ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయన్నది ఏబీఎన్ ఇచ్చిన సంకేతం.
ఈ రిపోర్టుతో చంద్రబాబుకే ఏకంగా హెచ్చరికలు ఇచ్చినట్టు వ్యవహరించడమే గాక.. ఈ ప్రభుత్వం పాలనలో పారదర్శకత లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు అనుచరుల్లో ఆందోళనకు దారితీస్తోందని తెలుస్తోంది.
వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ కథనాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘చంద్రబాబు మౌత్పీస్’గా పేరుగాంచిన ఏబీఎన్ ఛానల్ నుంచే ఇలాంటి విమర్శలు రావడం ఆశ్చర్యకరమని పేర్కొంటూ.. కూటమి పాలనలో అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని అంటోంది.
మరోవైపు, ఏబీఎన్ రాధాకృష్ణ ఇలా విమర్శలు గుప్పించడంలో అంతర్లీన కారణాలు ఉన్నాయంటూ.. తెర వెనుక రాజకీయం జరిగిందని టిడిపి వర్గాలు అనుమానిస్తున్నట్టు సమాచారం. ఇది నిజం కాని అపోహనా అన్నది త్వరలోనే తేలనుంది.
ఏదేమైనా.. ఈ రిపోర్టుతో ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయడం ఖాయం.