జనసేన నాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది. మరోసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వనని పవన్ కళ్యాణ్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలా జరగాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల మధ్య బంధం దృఢంగా ఉండాలి. అన్నిటికీ మించి ఈ మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం అవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తుకు విఘాతం కలగకూడదు. ముందుగా, కింది స్థాయిలో క్రమశిక్షణ కచ్చితంగా పాటించాలి. ఇప్పుడు జనసేన అదే చేస్తోంది. పొత్తుకు విఘాతం కలిగించే నాయకులను పక్కన పెడుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
2024 ఎన్నికలకు ముందు, ‘పవన్ అన్నకు జై కొడదాం.. జగనన్నకు ఓటేద్దాం’ అనే బృందం ఒకటి ఉండేది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని ఈ బృందం అన్ని విధాలా ప్రయత్నించింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేయాలంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిందేనని తేల్చి చెప్పారు. అటు భారతీయ జనతా పార్టీని సైతం కూటమిలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీతోనే కలుస్తానని స్పష్టం చేసి, నచ్చినవారు పార్టీలో ఉండండి, నచ్చనివారు వెళ్లిపోవచ్చని కూడా పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తర్వాత అవసరాల కోసం చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జనసేనలోకి వచ్చారు. వారిలో కొందరికి ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు ఉంది. అటువంటి వారి విషయంలో జనసేన జాగ్రత్తలు తీసుకుంటోంది.
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, జనసేన ఇన్చార్జి టీవీ రామారావుపై జనసేన నాయకత్వం వేటు వేసింది. ఇటీవల సహకార సొసైటీలకు సంబంధించి నియామకాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాల్లో జన సైనికులకు అన్యాయం జరిగిందంటూ టీవీ రామారావు ఆందోళన బాట పట్టారు. దీనిని గుర్తించిన జనసేన నాయకత్వం, పొత్తుకు విఘాతం కలిగేలా వ్యవహరించినందుకు టీవీ రామారావుపై వేటు వేసింది. అయితే రామారావుపై వేటు జన సైనికులకు హెచ్చరికగా మిగిలింది. మున్ముందు పొత్తుకు విఘాతం కలిగించే ఎటువంటి ప్రయత్నాలు చేసినా మిగతా వారికి ఇదే పరిస్థితి అని జనసేన నాయకత్వం హెచ్చరిక జారీ చేసింది. ఇది భవిష్యత్తు పరిణామాలను ఊహించి చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడక్కడ అసంతృప్తులు రావడం సహజం. అయితే ఇదే అదునుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి కలిగిన నేతలు పావులు కదపడం ప్రారంభించారు. జనసైనికులలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ముందుగానే పవన్ కళ్యాణ్ గుర్తించారు. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతున్నారు. మూడు పార్టీల మధ్య పదవులు, ప్రయోజనాలు అనేవి అంతర్గత విషయాలుగా భావిస్తున్నారు. వాటిని బహిర్గతం చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అస్త్రం అందించే నేతలు అవసరం లేదని భావిస్తున్నారు. అందుకే టీవీ రామారావు లాంటి జనసేన ఇన్చార్జిని సైతం పక్కన పెట్టారు. మున్ముందు పార్టీ క్రమశిక్షణ కట్టుదాటితే చర్యలు తప్పవని జనసేన అధినేత స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు.