తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడుపై వీరంగం సృష్టించారు. తాను చెప్పిన పనులు చేయలేదనే ఆగ్రహంతో డీపీఓను అందరి ముందు ఇష్టమొచ్చినట్లు తిట్టడమే కాకుండా, బూతులు తిడుతూ బెదిరింపులకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తన ఆదేశాలను పాటించకపోతే అంతు చూస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి డీపీఓను బెదిరించినట్లు తెలుస్తోంది. “బీ కేర్ఫుల్.. రేపు మీ ఆఫీస్కు వచ్చి కొడతా” అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఒక ప్రజాప్రతినిధి, పైగా మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారి పట్ల ఇలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇదేనా ఏపీ సీఎం చంద్రబాబు తన టీడీపీ నేతలకు నేర్పిన సంస్కారం?” అంటూ సామాజిక మాధ్యమాల్లో నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన సమయంలో ఇలాంటి అనుచిత ప్రవర్తన శోచనీయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.