వైఎస్సార్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బాధితుడే జైలులో ఉండగా దాడి చేసినవారు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు ప్రజలకు సేవ చేసిన నాయకుడని, ఆయనపై ఇలాంటి చర్యలు అన్యాయమని అన్నారు.
ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలు కష్టపడుతున్నప్పటికీ లాభం మాత్రం టీడీపీకి దక్కుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిని వివరించేందుకు బైరెడ్డి ఒక వ్యంగ్య కథ చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన దుప్పటి, చెట్టు, ఆవును లోకేష్, పవన్ మధ్య పంచుకునే సందర్భంలో, పని మొత్తం పవన్ చేయాల్సి వస్తుందని, కానీ లాభం మాత్రం లోకేష్కు చేరేలా పంచుకున్నారని వ్యాఖ్యానించారు.
ఈ కథ ద్వారా జనసేన కార్యకర్తల శ్రమను టీడీపీ ఉపయోగించుకుంటోందని బైరెడ్డి విమర్శించారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.


