ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు పాలనా పనుల్లో తీరిక లేకుండా ఉండగా, మరోవైపు జనంలోకి అడుగుపెట్టి వారి బాధలు తెలుసుకోవడంలో నిమగ్నమవుతున్నారు. ఇటీవల ఓ చర్మకారుడి డప్పు కొట్టి తనదైన శైలిలో జనానికి చేరువయ్యారు. ఇది తన రాజకీయ ప్రయాణంలో అరుదైన దృశ్యంగా నిలిచింది.
ప్రజా జీవనాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఏసీ గదుల్లో కూర్చొని నివేదికలు చదవడం సరిపోదని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ప్రజల మధ్యకి వెళ్లి, వారి జీవితాలను దగ్గరగా చూడాలి. వారు తింటున్న తిండి తినాలి. వారి రోడ్డుపై నడవాలి. అప్పుడే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఎంత ఇచ్చినా, ప్రజల మధ్య ఉండటం వల్ల వచ్చే నిజం వేరు.
తాజాగా ఆయన క్వాంటం వ్యాలీకి సంబంధించిన సమావేశానికి హాజరయ్యారు. అమరావతి భవిష్యత్తుపై ప్రణాళికను వెల్లడించారు. పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందిస్తోంది. ఇదే సమయంలో కార్పొరేట్ ప్రపంచంతో పాటు సామాన్యుడితో కూడా మమేకమవుతున్న చంద్రబాబు, ఓ చర్మకారుడితో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఆ వ్యక్తి జీవన పరిస్థితుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా అతడి డప్పు తీసుకొని కొట్టారు. అంతే కాదు, తన కాన్వాయ్లో ఆ వ్యక్తికి చోటిచ్చారు. పక్కనే కూర్చోబెట్టి మాట్లాడారు. సాధారణంగా నాయకులు చేసే రాజకీయ, పథకాలపై చర్చలు కాకుండా, అతడి వ్యక్తిగత జీవితం, కుటుంబ పరిస్థితులపై చర్చించారు.
ఈ సందర్భంలో ఆ వ్యక్తి — పోషిబాబు — ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. సీఎం చంద్రబాబు తన దగ్గరికి రావడం, తన డప్పు కొట్టడం, తనను కాన్వాయ్లోకి తీసుకొని వెళ్లడం అన్నీ తన జీవితంలో మరపురాని క్షణాలుగా మిగిలిపోయాయి. సీఎం ఉన్నారని తెలిసినా, పోషిబాబు స్పష్టంగా, స్వేచ్ఛగా మాట్లాడారు. చక్కగా ప్రతిప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సీఎం పక్కన ప్రయాణించే అవకాశం రావడంతో గర్వంగా నిండిపోయారు.
ఈ దృశ్యాన్ని తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా విభాగం బాగా ప్రచారం చేస్తోంది. “చంద్రబాబు క్లాస్ కాదు.. మాస్” అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. “ఏదైనా చేయగల నాయకుడు చంద్రబాబు” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ అనుకూల వర్గాలు మాత్రం దీనిని వ్యంగ్యంగా “తన డప్పు తానే కొట్టుకున్నట్టు” చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఎలా చూసినా, ఈ సంఘటన చంద్రబాబు జనాల్లో మమేకమవుతున్నదానికి ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది. ఒక రాజకీయ నాయకుడి నిజమైన విలువ జనాల్లోకి వెళ్లినప్పుడే బయటపడుతుంది అని మరోసారి ఆయన ప్రూవ్ చేశారు.