ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సవాలుగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్, ఆయన కుటుంబం, వైఎస్సార్సీపీ నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన టీడీపీ ఇప్పుడు అదే సోషల్ మీడియా దెబ్బ తినడం ప్రారంభమైంది.
ప్రస్తుతం ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మారుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. లోకేశ్ నేతృత్వంలోని టీడీపీ సోషల్ మీడియా విభాగం గతంలో విపక్షంపై ఎలా విషప్రచారం చేసిందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అదే స్వరూపం ప్రజల నుంచి, సోషల్ మీడియా వేదికల నుంచి వస్తుండటంతో బాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా స్వేచ్ఛను సమర్థించిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక దానిని అణగదొక్కే ప్రయత్నం చేయడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలు, అబద్ధ హామీలపై ప్రజలు స్పందించగానే వారిపై కేసులు పెట్టడం, రెడ్బుక్ పేరుతో బెదిరించడం ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధం.
చంద్రబాబు గారు నిజంగా సోషల్ మీడియాను గాడిన పెట్టాలనుకుంటే ముందుగా తన పార్టీ కార్యకర్తలతోనే ఆ మార్పును ప్రారంభించాలి. విమర్శలు అణచివేయడం కంటే, ప్రజానుకూల పాలన అందిస్తే సోషల్ మీడియా భయం అవసరమే ఉండదు.

