కూటమి ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే సూచిస్తున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమై ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సోషల్ మీడియాపై కూడా నిఘా ఉంటుందని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ఆయన ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటలను పట్టించుకోవడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. కూటమికి అనుకూలమైన మీడియాకు ఆయన హెచ్చరికలు పంపడం చర్చనీయాంశమైంది.
శ్రీకాకుళంలో గొండు శంకర్ అనే యువ సర్పంచ్కు టీడీపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పటి వరకు పార్టీలో సీనియర్గా ఉన్న గుండ కుటుంబానికి కాదని శంకర్కు అవకాశం కల్పించారు. అయితే, రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడిగా ఉన్న సిట్టింగ్ మంత్రి ధర్మాన ప్రసాదరావును శంకర్ ఓడించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 52,000 ఓట్ల భారీ తేడాతో ఆయనను ఓడించారు. తనకంటే జూనియర్ చేతిలో ఓటమిని ధర్మాన ప్రసాదరావు జీర్ణించుకోలేకపోయారని సమాచారం. అయితే, ఇంతటి విజయం సాధించిన శంకర్ దూకుడుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే శంకర్ పంచాయతీ కార్యదర్శిని పిలిచి తీవ్రంగా మందలించారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇంతలో అక్కడ ఫోటోలు తీస్తున్న ‘ఈనాడు’ రిపోర్టర్పై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని పిలిచి దురుసుగా మాట్లాడటమే కాకుండా, ఫోటోలను డిలీట్ చేయించారు. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. తాను ‘ఈనాడు’ రిపోర్టర్నని చెప్పినా శంకర్ వినిపించుకోలేదని, అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈ విషయం ‘ఈనాడు’ యాజమాన్యం దృష్టికి వెళ్లిందని సమాచారం.
అధికార పార్టీకి అనుకూలమైన మీడియాగా భావించే ‘ఈనాడు’ విలేఖరిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గతంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే కూడా ‘ఈనాడు’ రిపోర్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా బెదిరించారు. అది వివాదాస్పదం కావడంతో సీఎం చంద్రబాబు ఆ ఎమ్మెల్యేను పిలిచి మాట్లాడారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇప్పుడు శంకర్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మీడియా పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.