కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు సమర్థత ఇప్పుడు ఇండిగో సంక్షోభం నేపథ్యంలో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై పట్టు, మంచి ఉపన్యాసకుడిగా ఉన్న పేరు… ఈ సమస్య పరిష్కారంలో ఏమాత్రం ఉపయోగపడలేదు. దేశ వ్యాప్తంగా లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి రావాల్సినంత దృఢమైన, సత్వర చర్యలు కరువయ్యాయనేది ప్రధాన విమర్శ.
ఇది కేవలం ఒక రవాణా సమస్య మాత్రమే కాదు, అత్యున్నత వర్గాలతో పాటు మధ్య తరగతి ప్రజల అత్యవసర ప్రయాణాలకు సంబంధించిన అంశం. కీలక సమయంలో విఫలమవడం వల్ల వ్యక్తిగతంగా రామ్మోహన్నాయుడు ట్రోల్స్కు గురవుతున్నారు.
ఈ కీలక సమయంలో సమర్థవంతంగా స్పందించడంలో, సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ పరిష్కారాలు చూపడంలో ఆయన వెనుకబడ్డారని విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఆయన ఇంతకాలం సంపాదించుకున్న సానుకూల ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, అంతిమంగా మోదీ ప్రభుత్వానికీ చెడ్డపేరు తెచ్చిపెట్టింది. పౌర విమానయాన శాఖ ప్రాధాన్యత లేనిదనే అంచనాలున్నా, ఈ ఒక్క సంఘటనతో దాని విలువ ఎంత కీలకమైందో నాయుడుకు తెలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆగ్రహం సోషల్ మీడియాలో ట్రోల్స్గా మారడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ వైఫల్యం కేవలం ఆయన ఒక్కరికే కాకుండా, ఆయనతో పాటు నారా లోకేశ్, దీపక్ రెడ్డి వంటి ఇతర యువ నాయకులపైనా ప్రభావం చూపి, వారిని కూడా ట్రోలింగ్కు గురిచేస్తోంది. రాజకీయాలకు అతీతంగా స్నేహంగా ఉండే ఆయన వ్యక్తిత్వం ఒకవైపు, క్రియాశీలక మంత్రిగా సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆయన చూపిన వైఫల్యం మరొకవైపు… ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఆయనకు ప్రతికూలంగా మారింది.


