రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనపై యువతరం నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గోదావరి యాసలో మాట్లాడుతున్న ఒక యువకుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పచ్చమీడియా చంద్రబాబును గొప్ప దార్శనికుడిగా అభివర్ణిస్తుంటే, ఆయన పాలన మాత్రం దరిద్రానికి దారి చూపే విధంగా ఉందని ఆ యువకుడు తీవ్రంగా విమర్శించాడు.
“పచ్చమీడియా ప్రచారంలో గ్రేట్ విజనరీ.. చంద్రబాబు మాత్రం దరిద్రానికి దారి చూపే దేవ దూత” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆ యువకుడు, చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్ 6’ పథకాల అమలు తీరుపై మండిపడ్డాడు. ఒక పక్క 14 ఏళ్ల బాలుడు క్రికెట్లో సిక్సులు కొడుతుంటే, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు ‘సూపర్ 6’ పథకాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశాడు.
చంద్రబాబు పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలను ప్రస్తావిస్తూ, తాజాగా సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టాడు. చంద్రబాబు నిర్లక్ష్యపు పాలన కారణంగానే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సింహాచలంలో కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయని, ఇది పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించాడు.
కాగా, ఇటీవల సింహాచలంలో జరిగిన దుర్ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలోనూ పలువురు మరణించడం చంద్రబాబు పాలనలో భద్రతా వైఫల్యాలకు నిదర్శనమని విపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో, యువతరం నుంచి కూడా చంద్రబాబు పాలనపై వస్తున్న ఇలాంటి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా తమదైన శైలిలో స్పందిస్తున్న యువత, పాలకుల పనితీరును సూటిగా ప్రశ్నిస్తున్నారు.