రాజకీయాల్లో ప్రచారం ఎంత బలంగా ఉన్నా, అధికారిక గణాంకాల ముందు అది నిలబడదు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం.. అనుకూల మీడియా వర్గాలు ఏపీ పారిశ్రామికంగా ఇప్పుడే దూసుకుపోతోందని చేస్తున్న ప్రచారంపై RBI డేటా నీళ్లు చల్లింది. 2019 నుండి 2024 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే, పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన వృద్ధిని కనబరిచిందని తేలిపోయింది.
RBI గణాంకాల ప్రకారం, 2019-24 కాలంలో తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన వృద్ధి రేటు గర్వించదగ్గది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలను వెనక్కి నెట్టి ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో పారిశ్రామిక దిగ్గజ రాష్ట్రాలతో పోటీ పడుతూ 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
మొత్తం పారిశ్రామిక రంగ వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే.. పారిశ్రామిక వృద్ధిలో దక్షిణాదిలో ఏపీ అగ్రస్థానంలో కొనసాగింది. దేశవ్యాప్తంగా టాప్-10 రాష్ట్రాల జాబితాలో 8వ స్థానంలో నిలిచి తన పట్టు నిలుపుకుంది.
ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈ విజయాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలకు అందించిన ప్రోత్సాహకాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా సాధించిన మొదటి ర్యాంకులు ఈ వృద్ధికి పునాదులు వేశాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. “గణాంకాలు అబద్ధం చెప్పవు. 2024 జూన్ వరకు ఉన్న డేటా అంటే అది ఖచ్చితంగా గత ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేదే.”
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అయితే గతంలో జరిగిన కృషిని గుర్తించకుండా, కేవలం ప్రచార ఆర్భాటాలతో పక్కదారి పట్టించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. RBI నివేదిక ద్వారా ఏపీ పారిశ్రామిక ప్రగతి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇప్పుడు ప్రజల ముందు స్పష్టంగా ఉన్నాయి.


