తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఈ నేపథ్యంలో టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో కొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారాయి.
లైవ్ డిబేట్ సందర్భంగా స్పందించిన సాంబశివరావు, “మూడో క్లాస్ చదివిన నాకు కూడా ఈ తీర్పు ఎలా వస్తుందో ముందే తెలుసు. రాజకీయాలు తెలిసిన వాళ్లెవ్వరూ ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తుందని అనుకోలేదు. నాలాంటి మూడో క్లాస్ చదివిన వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని అనుకోలేదు” అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ప్రసారమవుతూనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా “మూడో క్లాస్ చదివిన నేను” అన్న మాటలే ట్రోలర్లకు కొత్త ఆయుధంగా మారాయి. “3వ క్లాస్ పాస్ మాత్రమే పాస్ అయ్యావా సాంబన్న?”, “ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉంటే క్లాస్ ఎందుకు అవసరం?”, “మూడో క్లాస్ స్టేట్మెంట్ – ఫుల్ క్లాస్ ట్రోలింగ్” అంటూ మీమ్స్, సెటైర్లు వరుసగా దర్శనమిస్తున్నాయి.
కొంతమంది నెటిజన్లు అయితే సాంబశివరావు వ్యాఖ్యలను ఆత్మనిందగా తీసుకుంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం వ్యంగ్యంగా, తన అభిప్రాయాన్ని బలంగా చెప్పేందుకు చేసిన వ్యాఖ్య మాత్రమేనని సమర్థిస్తున్నారు. రాజకీయాలపై అవగాహనకు చదువు ఒక్కటే ప్రమాణం కాదని, అనుభవం కూడా ముఖ్యమేనని వారు అభిప్రాయపడుతున్నారు.
ఏదేమైనా, స్పీకర్ తీర్పుపై చర్చ కంటే… యాంకర్ మాటలే ఇప్పుడు పెద్ద చర్చగా మారడం విశేషం. రాజకీయ వ్యాఖ్యానాల్లో పదజాలం ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


