టీవీ5 సర్వే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమి పరిస్థితి ఏంటన్న ప్రశ్నకు సమాధానంగా టీవీ5 యాంకర్ టీవీ స్క్రీన్పై చూపించిన సర్వే ఫలితాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ సర్వే ప్రకారం, టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మొత్తం కేవలం 31 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించారు. అందులో టీడీపీకి 27 సీట్లు, జనసేనకు 2 సీట్లు, బీజేపీకి 2 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన 145 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయని టీవీ5 యాంకర్ స్పష్టం చేశారు.
సాధారణంగా టీవీ5 సర్వేలు కనీస అంచనాలతోనే ఉంటాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అలాంటప్పుడు ఈ స్థాయిలో వైసీపీకి భారీ ఆధిక్యం చూపించడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, హామీల అమలుపై సందేహాలు, పాలనపై విమర్శలు ఈ సర్వే ఫలితాల్లో ప్రతిబింబించాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వైసీపీకి ప్రజాభిమానమేం తగ్గలేదని, జగన్ నాయకత్వంపై నమ్మకం మరింత బలపడుతోందన్న సంకేతాలుగానే ఈ సర్వేను అభిమానులు చూస్తున్నారు. సంక్షేమ పథకాలు, నేరుగా ప్రజలకు అందిన లబ్ధి, గడపగడపకు ప్రభుత్వం వంటి కార్యక్రమాలు పార్టీకి బలంగా మారాయని వారు అంటున్నారు.
ఇక “Welcome to జగనన్న 2.0” అంటూ సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఈ సర్వేను షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుపు దాదాపు ఖాయమన్న భావన ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో, రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది. కానీ టీవీ5 సర్వే మాత్రం కూటమికి గట్టి హెచ్చరికగా, వైసీపీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంకేతంగా మారిందనడంలో సందేహం లేదు.


