సింహాచలం ఆలయం వద్ద జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. క్యూలైన్ వద్ద గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రాజకీయ వర్గాలు, సామాన్యులు కలిపి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయి.
గతంలో జగన్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసిన పవన్, ఇప్పుడు అధికార కూటమి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఎందుకు మౌనంగా ఉన్నారో అంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో “ఆ గొంతు ఏది పవన్?” అంటూ ప్రశ్నిస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి విపత్తులో పవన్ కల్యాణ్ స్పందించని తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ ఇప్పటివరకు అక్కడికి వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ పాలనలో జరిగిన ఇలాంటి ఘటనలపై పవన్ కఠినంగా స్పందించేవారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడీ సందర్భంలో మాత్రం ఆయన నుంచి అలాంటి స్పందన రాకపోవడాన్ని “పొత్తు ధర్మం” కింద విరమణగా కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచే పవన్ ఎక్కడ?”, “రాజకీయ లాభం కోసం మాత్రమే పూర్వంలో గళమెత్తినట్లు ఇప్పుడు కనిపిస్తోంది” అని అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి. అమరావతి రీ-లాంచ్ ఆహ్వాన పత్రికలో పేరు లేకపోవడంపై వెంటనే స్పందించిన పవన్, ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మౌనం అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి, ప్రజల సమస్యలపై చొరవ చూపిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నది పెద్ద చర్చగా మారింది.