ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. “ఎవడు” అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, వివాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో యెల్లో మీడియా చూపిస్తున్న అతి తెలివితేటలు ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నాయి.
ప్రత్యేకంగా ఏబీఎన్ ఛానెల్ దీనిపై చేసిన చర్చలో, బాలకృష్ణ వ్యాఖ్యలకంటే చిరంజీవి ఇచ్చిన స్పందనకే ప్రాధాన్యం ఇచ్చారు. యాంకర్ వెంకటకృష్ణ సహా అక్కడి వక్తలు, బాలయ్య తప్పేం చేయలేదన్నట్లు సమర్థిస్తూ, చిరంజీవి రియాక్షన్ వల్లే ఈ ఇష్యూ పెద్దది అయిందని చెప్పడం గమనార్హం. ఇది సరైన దృష్టికోణమా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో జోరుగా వినిపిస్తోంది.
అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే, అదీ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి, మరో సీనియర్ నటుడిపై అవమానకరమైన పదజాలం వాడితే అది తప్పు కాదా? దాన్ని పట్టించుకోకుండా “చిరంజీవి ఎందుకు వెంటనే స్పందించాడు?” అని ప్రశ్నించడం మీడియా పక్షపాతం కాదా? అన్న సందేహం కలుగుతోంది.
ఇక ఈ తరహా వాదనలతో, టీడీపీకి డ్యామేజ్ కాకుండా చూడాలని, తప్పు చేసిన బాలకృష్ణను కాపాడాలని యెల్లో మీడియా ప్రయత్నించడం ప్రజలు ఖండిస్తున్నారు. ఒకవైపు న్యాయపరంగా నిలబడి వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత వహించాల్సిన మీడియా, పక్షపాతం చూపిస్తూ నిందని చిరంజీవిపైనే మోపడం అసలు పాత్రికేయ ధర్మానికి విరుద్ధం.
మొత్తం మీద, యెల్లో మీడియా “అతి తెలివితేటలు” ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసినవారిని కాపాడటం పాత్రికేయ ధర్మమా? లేక వాస్తవాన్ని చెప్పడం పాత్రికేయ ధర్మమా?