రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహంతో మండి పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. జగ్గయ్యపేట నుండి చిత్తూరు వరకు, కోనసీమ నుండి విజయవాడ వరకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎమ్మెల్సీ అనంత బాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ర్యాలీకి నాయకత్వం వహించారు. పోలీసులు అనుమతులు నిరాకరించినా ప్రజల మధ్యలోనే నిరసనలు కొనసాగించారు.
విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, “చంద్రబాబు దుర్మార్గం రాష్ట్రమంతా చూస్తోంది. పేదల వైద్య హక్కును హరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది,” అన్నారు. పులివెందులలో కేంద్రం ఇచ్చే మెడికల్ కాలేజీలను కూడా తిరస్కరించారని మండిపడ్డారు.
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, రామచంద్రపురం ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ కూడా తమ తమ ప్రాంతాల్లో ఉద్యమాలకు నాయకత్వం వహించారు.
వైఎస్సార్సీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, “మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతుంది,” అని స్పష్టం చేశారు.
ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి కూటమి ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

